||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఏబది ఆరవ సర్గ||

||"దక్షిణాత్ ఉత్తరం దిశమ్ ప్రపేదే|"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షట్పంచాశస్సర్గః||

తత్త్వదీపిక
ఏబది ఆరవ సర్గ.
"దక్షిణాత్ ఉత్తరం దిశమ్ ప్రపేదే"

'దక్షిణాత్ ఉత్తరం దిశమ్' అంటే
'దక్షిణము నుంచి ఉత్తర దిశకి " అని
"ప్రపేదే హరిశార్దూలః" -
వానరులలో శార్దూలము లాంటి హనుమ ఆకాశములోకి ఎగిరాడుట.

'తతో రావణ నీతాయాః " అంటూ
రావణునిచే అపహరింపబడిన సీతమ్మను అన్వేషించడానికి,
'చారణా చరితే పథి"- దక్షిణ దిశలో చారణులు వెళ్ళిన మార్గములో వెళ్ళిన హనుమ,
'దక్షిణాత్ ఉత్తరం దిశం ప్రపేదే' , అంటే దక్షిణము నుంచి ఉత్తరానికి తిరుగుముఖము పట్టాడన్నమాట.

ముప్పది ఎనిమిదవ సర్గలో సీతమ్మ చూడామణి ఇచ్చిన తరువాత
హనుమ అది తీసుకొని 'హృదయేన తు గతో రామం'
అంటే మనస్సులో రాముని చేరిపోయాడుట.

సంతోషమైన మనస్సుతో "ప్రతి సంక్రమం ప్రపేదే"-
అంటే తిరుగు ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడుట.
కాని ఆగిపోయాడు సీతమ్మ ప్రశ్నలతో.

మళ్ళీ సీతమ్మ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి నలభైయవ సర్గలో
'ఇంకా 'అల్పావశేషం' అంటే కొంచము మిగిలిన కార్యము చూసి పోదాము అనుకుంటూ,
'దిశం హ్యుదీశం మనసా జగామ' అంటే మనస్సులో ఉత్తర దిశ చేరాడుట.
కాని శరీరముతో అక్కడే ఉండి పోయాడు.

నలభైఒకటి సర్గలో కథ కొంచెము మలుపు తిరుగుతుంది.
ఒక సారి దండో పాయము ఉపయోగించి ,
వెనక్కి వెళ్ళే ముందర శత్రువుల బలము పరిక్షిద్దామనుకున్న హనుమ
అశోకవనము ధ్వంసము చేసి,
పట్టుకోడానికి వచ్చిన రాక్షసులను హతమార్చి,
రాక్షసరాజుని చూచి,
లంకాదహనము గావించి,
సురక్షితముగా వున్న సీతను చూచి,
"ప్రపేదే హరిశార్దూలః" -
అప్పుడు ఉత్తరదిశగా బయలుదేరాడన్నమాట.

హనుమ బయలుదేరుతున్నాడు అంటే
సీతమ్మ కి ప్రశ్నలు మళ్ళీ మనస్సులో మెదలుతూనే ఉంటాయి.
తన మనస్సులో ఉన్నమాట మళ్ళీ చెపుతుంది సీతమ్మ.

"కామం అస్య త్వమేవ ఏకః కార్యస్య పరిసాధనే" అంటే
'అసలు ఈ కార్యము సాధించడానికి నీవు ఒక్కడివే చాలు' అని.
అయితే ఇంకేముందీ అనుకోవచ్చు,
సీతమ్మ మనస్సులో మాట ఇంకోటి.
అది రాముడే వచ్చి లంకలో సంకులము కావించి ,
తనని తీసుకుపోవాలి అని.

ఎందుకు ఆ కోరిక ?
తన అంతస్తుకి తగినట్లుగా రాముడే రావాలా ?
కాదు.
అది - "తత్ తస్య సదృశం"
అది ఆయనకి తగిన పని అని.

'సీతమ్మ ని రక్షించినది రాముడు " అని రామునికి కీర్తిరావాలి.
హనుమంతుడు రక్షించి తీసుకుపొతే,
ఆ అసమాన కీర్తి హనుమంతుడికే దక్కుతుంది.

ఈ మాట ముందు కూడా చెప్పినదే.
కాని మళ్ళీ మళ్ళీ చెప్పడములో సీతమ్మకి
భర్తయొక్క గౌరవవాభిమానముల మీద
ఎంత భక్తి ఉందో మనకు తెలుస్తుంది.
అదే ప్రతి భార్యకు భర్తమీద వుండవలసిన ఆదరాభిమానములు,
అని సుందరకాండ మనకి చెపుతుంది.

అయితే మరి ప్రతిభర్తకి భార్యపై వుండవలసిన ఆదరాభిమానములు
ఇక్కడ చెప్పలేదే అని అనిపించవచ్చు.
అది ఉత్తరకాండలో రాముడిద్వారా వింటాము.

ఇంకో మాట.
చివరి సర్గలో విన్నాము
'దగ్ధేయం నగరీ సర్వా'
'జానకీ న చ దగ్ధేతి' అని.
అంటే 'నగరమంతా దగ్ధమైంది కాని
జానకి మాత్రము దగ్ధము కాలేదు' అని.
దానికి హనుమ ప్రతిపాదించిన కారణాలు విన్నాము.
అగ్నినే దహింపగల శక్తి వున్న సీతమ్మని
అగ్ని ఎలా దహించకలదు అన్నది ఒక కారణము.
అలాగే ఇంకావున్నాయి కారణాలు.

అయితే ఇక్కడ లంకాదహనములో సీతమ్మ సురక్షితముగా వుండడములో
ఇంకో సంగతి మనకి తెలుస్తుంది.

సీతమ్మ అయోనిజ.
అంటే ఆమె పుట్టుకలేనిది.

ఆత్మ కూడా పుట్టుకలేనిది.
భగవద్గీతలో వింటాము - "న జాయతే.." పుట్టుకలేనిది.
"మ్రియతేవా కదాచిత్" అనికూడా వింటాము .
అంటే మరణము కూడా లేనిది.
అది ఆత్మ.

మళ్ళీ భగవద్గీత లో వింటాము.
"న దహ్యతే దహ్యమానే శరీరే".
శరీరము దహింపబడినా, ఆత్మ దహింపబడదు అని.

లంకా అనబడు శరీరము దహింపబడినా,
ఆత్మ స్వరూపమైన సీతమ్మ దహింపబడకుండా వుండడముతో,
శరీరము దహింపబడినా ఆత్మ దహింపబడదు అనే సత్యాన్ని నిరూపిస్తున్నాడు కవి.

సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి అయిననూ ఆత్మగా నటించి,
జీవుని స్వరూపమును, ఆ జీవుడు బంధములో నుంచి బయటపడే విధానమును ,
జీవుడు మోక్షమునకై ప్రయత్నించవలసిన తీరును ,
మనకి సుండరకాండలో చూపించడమైనది.

హనుమ ఆచార్యుడిగా ,
మోక్షమందు కోరిక గల జీవుని ( శిష్యుని) అన్వేషించి,
భగవంతునికి నివేదించుటకు వెనకకి బయలుదేరెను అన్నమాట.

ఇక్కడ సాధకుడు కర్మయోగముచే పరిశుద్ధమైన అంతః కరణము కలవాడై,
ఆత్మావలోకనము చేసి,
విషయములను , ఇంద్రియములను మనస్సునూ బుద్ధినీ కామమునూ జయించి,
భగవత్ ప్రాప్తికై అభిముఖుడగుట కూడా సుందరకాండలో స్ఫురిస్తుంది.

అంటే "తతోరావణ నీతాయాః" అంటూ
మనస్సుచేత హరింపబడి
దారి తప్పిన ఆత్మ అన్వేషణకై బయలు దేరిన హనుమ,
తన అన్వేషణ పూర్తి చేసికొని,
భగవంతునికి నివేదించుటకు ఉత్తర దిశగా బయలుదేరడముతో
ఆచార్యుడిగా హనుమ కార్యక్రమము పూర్తి అయినది అన్నమాట.
సుందరకాండలో ఇక ముందు జరిగేది కధావిశేషమే.

ఇక ఈ సర్గలో జరిగిన కథ విందాము.

సీతమ్మ క్షేమముగా వున్నది అన్న చారణులమాట విని,
కుదుటబడిన మనస్సు కల హనుమ,
అప్పుడు అశోకవనములో శింశుపావృక్షమూలములో ఉపస్థితురాలైవున్న
జానకికి అభివాదము చేసి ఇట్లు పలికెను.

' అమ్మా అదృష్టము కొలదీ నిన్ను క్షేమముగా ఇక్కడ చూచుచున్నాను'.

అప్పుడు బయలుదేరుటకు సిద్ధముగా నున్న హనుమంతుని చూచుచూ,
సీత భర్తపై తనకు గల స్నేహము ఉట్టి పడేటట్లు గా ఇలా పలికెను.

'ఈ కార్యము సాధించుటలో బహుశ నీవు ఒక్కడివే చాలును.
అలాచేసినచో నీ బలములు కీర్తి పెరుగును.
పరశత్రువుల చీల్చి చెండాడగల రాముడు
సమస్త లంకానగరమును సంకులము చేసి నన్ను తీసుకు పోయినచో,
అది ఆయనకు తగినట్లు ఉండును.
ఆ మహాత్ముడు తన పరాక్రమమునకు అనుగుణమైన తీరుగా ఎట్లు చేయువలెనో
దానికి తగు రీతిగా నీవు సూచనలు ఇమ్ము'.

అప్పుడు హనుమంతుడు సీతాదేవిచే పలకబడిన
అర్థవంతముగా వున్న హేతువులతో కూడి యున్న వచనములను విని
హనుమంతుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను.

' అమ్మా! కాకుత్‍స్థుడు వానర భల్లూక సేనలతో త్వరలో వచ్చును.
యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తీర్చును'.
వైదేహి కి ఈ విధముగా ఆశ్వాసనము ఇచ్చి,
హనుమంతుడు వెళ్ళుటకు నిశ్చయించుకొని వైదేహికి నమస్కరించెను.

అప్పుడు ఆ కపిశార్దూలుడు స్వామి సందర్శనోత్సాహముతో
గిరులలో శ్రేష్టుమైన అరిష్ఠ పర్వతమును ఎక్కెను.

ఎత్తైన పద్మక వృక్షములున్న నల్లని వనములతో కూడిన ఆ పర్వతము
శిఖరాలమధ్య వ్యాపించిన మేఘములతో
ఉత్తరీయము ధరించినదా అన్నట్లు ఉండెను.

శుభకరమైన దివాకర కిరణములు ప్రేమాస్పదముగా మేల్కొలపగా
పైకిలేచిన గైరికాది ధాతువులు మెరుస్తూ ఆ పర్వతపు కన్నులవలె నున్నవి.

ఆ పర్వతపు శిలలపై పారుతున్న జలప్రవాహ ధ్వనులు
పర్వతము మంత్రములు చదువుతున్నవా అన్నట్లు వినపడుచున్నవి.

అక్కడి పొడుగాటి దేవదారువు వృక్షములు
పైకెత్తిన బాహువులలానూ,
శిఖరములలో పైనుంచి పడుచున్నజలపాతముల ధ్వనులు
గొంతెత్తి అరుస్తున్నవా అన్నట్లు ఉన్నాయి.

నల్లని శరత్కాల మేఘములు
ఆ పర్వతమును కదుపుచున్నవా అన్నట్లు ఉన్నాయి.
గాలితో కొట్టబడిన వెదురు చెట్లధ్వనులు
పర్వతము వేణువు ఊదుచున్నట్లు ఉంది.

పర్వతము మీద ఘోర సర్పముల బుసలు
పర్వతము నిట్టూర్పులు విడుచుచున్నదా అన్నట్లు ఉన్నవి.

ఆ పాదపర్వతములు
పర్వతము మీద సంచరించే మేఘముల పాదాలవలె ఉండడముతో,
ఆ పర్వతమే నడుచుచున్నదా అన్నట్లు ఉండెను.

ఆ పర్వతము అనేక శిఖరములతో గుహలతో శోభించుచుండెను.
ఆ పర్వతము సాల తాళ వృక్షములతో దట్టముగా నిండి యుండెను.
ఆ పర్వతరాజము విరబూసిన పుష్పములు కల లతలతో,
అనేకరకముల జంతు సమూహములతో
ధాతుస్రావాలతో అలంకృతమై శోభించుచుండెను.

అనేక సెలయేళ్ళు ప్రవహిస్తూ
సంచారానికి ఆటంకము కలిగించు శిలల గుట్టలతో వున్న ఆ పర్వతము
మహర్షులు యక్షులు గంధర్వులు కిన్నరులు ఉరగముల చేత సేవింపబడుచుండెను.

అనేక లతల వృక్షముల సముదాయముతో అలంకరింపబడిన
ఆ పర్వత గుహలను సింహములు నివాసముగా చేసుకొన్నాయి.
పర్వతము మీద వ్యాఘ్రముల సముదాయము సంచరిస్తున్నాయి.
ఆ పర్వతము మధురమైన ఫలములతో నిండిన వృక్షములతో నిండియున్నది.

పవనాత్మజుడైన హనుమంతుడు
శీఘ్రముగా రామదర్శనమునకై ఆతురతో
రామదర్శనము అన్న సంతోషముతో ఆ పర్వతము ఎక్కెను.

అప్పుడు ఆ సుందరమైన పర్వతపు సానువులందు ఉన్న శిలలు
హనుమంతుని పాదముల కింద నలిగి పెద్ద చప్పుళ్ళతో చూర్ణమైపోయాయి.

ఆ మహాకపి ఆ సముద్రపు దక్షిణతీరమునుండి ఉత్తరతీరము చేరగోరి
ఆ పర్వత శిఖరము ఎక్కి తన శరీరప్రమాణమును మరింత పెంచెను.

అప్పుడు ఆ హనుమంతుడు ఆ పర్వత శిఖరముపై నిలబడి
మీనములతో సర్పములతో నిండియున్న
భయము కొలుపుతున్న సముద్రమును చూచెను.

వాయుపుత్రుడూ వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు
దక్షిణ దిశనుంచి ఉత్తర దిశగా పయనించుటకు
వాయువేగముతో ఆకాశము లోకి ఎగిరెను.

హనుమంతుడు పైకి ఎగిరినప్పుడు ఏర్పడ్డ ఒత్తిడికి
ఆ పర్వతము అక్కడి ప్రాణులతో సహా భూమిలోకి క్రుంగి పోసాగెను.
అప్పుడు పర్వత శిఖరాలు అన్నీ కంపించడముతో
వృక్షములు ఆన్నీవేళ్ళతో సహా నేలకూలిపోడముతో
అందుండి బ్రహ్మాండమైన ధ్వని వెలువడినది.

హనుమ ఊరువుల వేగధాటికి
విరబూసిన పువ్వులతో వున్న వృక్షములన్నీ
ఇంద్రుని ఆయుధముతో కొట్టబడినట్లు భూమిపై పడిపోయాయి.

గుహలలో ఉండి చిక్కుపడిపోయిన
మహాశక్తిమంతమైన సింహముల నినాదముతో
ఆకాశము మిన్ను ముట్టినది.

విద్యాధరులు భయపడినవారై
పక్కకి జారిన వస్త్రములతో
అస్తవ్యస్తమౌతున్న ఆభరణాలతో
భూమి నుంచి ఆకాశమునకి వెంటనే కంగారుగా ఎగిరిరి.

పెద్ద బలమైన పాములు ఆ వత్తిడికి నలిగి పోయి
మహా విషములను విరజిమ్ముతూ చుట్టలు చుట్టుకోసాగాయి.
అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్షులతో కలిసి విద్యాధరులు
ఆ హనుమంతుని వత్తిడి చే పీడింపబడుతున్న
ఆ పర్వతమును వదిలి ఆకాశములోకి ఎగిరిరి.
ఆ బలవంతునిచే నొక్కబడి వృక్షములతో నున్న శిఖరాగ్రములు
భూమిలో ఒరిగి పాతాళంలోకి కుంగి పోసాగినవి.

పదియోజనముల విస్తారము కల ముప్పది యోజనముల ఎత్తుగల
ఆ పర్వతము పూర్తిగా నేలమట్టమయినది.

ఆ వానరుడు కల్లోలమైన తరంగాలతోవున్న
ఆ సముద్రమును అవలీలగా దాటగోరి ఆకాశములోకి ఎగిరి
దక్షిణ దిశనుంచి ఉత్తరదిశగా పయనించెను.

ఈ విధముగా వాల్మీకి రచించిన ఆదికావ్యమైన రామాయణములో సుందరకాండలో ఏబది ఆరవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||